మాచారెడ్డి మండలం భవానిపేట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థకు గురై కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి షబ్బీర్ అలీ నేడు పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పాఠశాలలకు పంపిణీ చేసే బియ్యం, కూరగాయల నాణ్యతా లోపంతోనే మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వాంతులు విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారన్నారు.
పాఠశాలలో జాలికట్టిన బియ్యం, పురుగుల అన్నం తిని 82 మంది విద్యార్థులు, ఆస్పత్రి పాలయ్యారని అన్నారు. సకాలంలో వైద్యులు స్పందించి మెరుగైన చికిత్స అందించడం వలన ప్రమాదం తప్పిందన్నారు. జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి బాధ్యులను కఠినంగా శిక్షించి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా చూడాలని కలెక్టర్ ను కోరారు.