సుదీర్ఘ రాజకీయ జీవితంతో రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గుర్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయన సాధించారు. ఈ విషయాలన్నీ మనకు అందరికి గుర్తున్నాయి…. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మాత్రం గుర్తున్నట్లు లేదు.
రాజకీయ కురువృద్ధుడు మహానేత అయిన కొణిజేటి రోశయ్యకు తీరని అవమానం చేస్తున్నారు. ఇటీవల మరణించిన రోశయ్యకు సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర శాసనసభ సంతాపం వ్యక్తం చేయాలి. ఆయనకు సంతాపం తెలిపిన తర్వాత… మాజీ ముఖ్యమంత్రి కాబట్టి…. సభ వాయిదా పడాలి. సాధారణ శాసనసభ్యులు, మాజీ సభ్యులు అయితే సంతాపం తీర్మానం పెట్టి రెండు నిమిషాలు సభలో మౌనం పాటిస్తారు.
ఇది సాంప్రదాయం కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రం మహానేత రోశయ్యకు ఘోర అవమానం జరిగింది. ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి మాత్రం సంతాపం తెలిపిన జగన్ మోహన్ రెడ్డి, ఒక రోజు అసెంబ్లీ సెలవు ప్రకటించారు. మరి మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్య కి, కనీసం సంతాపం కూడా తెలపలేదు. జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్య ఎంతో సన్నిహితంగా ఉండే వారు.
ఎంతో ఆప్యాయంగా, ప్రతి అంశంలో తోడుగా ఉండేవారు. అది కూడా జగన్ రెడ్డికి గుర్తు లేదా? అని వైశ్య ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. సంతాపంలో కూడా కులం చూసుకుంటున్నారా? లేదా తనకు రావాల్సిన సియం పదవి ఆ నాడు రోశయ్యకు ఇచ్చారని కక్ష కట్టారా ? అని వైశ్యులు భగ్గుమంటున్నారు. రోశయ్య మరణించిన తర్వాత ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించేందుకు కూడా జగన్ వెళ్లలేదు. అప్పటిలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కనీసం అసెంబ్లీలో మహానేత రోశయ్యకు సంతాపం కూడా చెప్పలేదు.