అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నేడు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల లో ఝాన్సీ లక్ష్మీబాయి 192 వ జయంతి(స్త్రీ శక్తి దివస్) కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆమె చిత్రపటానికి ప్రిన్సిపల్ వై.లక్ష్మీ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు ఎంతో ఆదర్శం ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. చిన్నతనం నుంచే చిట్ట చివరి క్షణం వరకూ తన రాజ్య రక్షణకోసం బ్రిటిష్ వారికి ఎదిరించి పోరాడిన ధీరవనిత ఝాన్సీలక్ష్మీబాయి అన్నారు. లక్ష్మీబాయి స్ఫూర్తితో నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆమె పోరాట పటిమ నేటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. అనంతరం ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి ఏ.శ్రీకాంత్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మి భాయ్ జయంతిని “స్త్రీశక్తి దివస్” అనే పేరుతో దేశవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో నిర్వహిస్తున్నామన్నారు.
సమాజంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చాటిచెప్పిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ నాయుడు, ఎబివిపి నగర కార్యదర్శి డీ.యోగేశ్వరరావు నాయకులు వి.పులిరాజు, కే. చిరంజీవి, టీ. సంతోష్ తదితులు పాల్గొన్నారు.