రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోకుండా అడ్డుపడే విధంగా ప్రవర్తించిన మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిని సుప్రీంకోర్టు తమ వద్ద హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అర్నబ్ గోస్వామిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసిన మహారాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అందులో అర్నబ్ గోస్వామి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే వీలులేకుండా క్లాజు పెట్టారు.
దీన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే అసెంబ్లీ సెక్రటరీని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అర్నబ్ గోస్వామి ఆరోపించగా దానిపై అక్టోబర్ 13న అర్నబ్ గోస్వామికి అసెంబ్లీ కార్యదర్శి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు.
దేశంలో ఏ పౌరుడు కూడా తమ హక్కులను పూర్తిగా వినియోగించుకోకుండా ఎవరూ అడ్డుకోలేరని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. న్యాయం సమకూర్చేందుకు ప్రతిబంధకాలు కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద చెల్లదని ఆయన అభిప్రాయపడ్డారు.