ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికపై సుప్రీంకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి నుంచి ఆయన విజయం సాధించడంపై సరిహద్దు భద్రతాదళాల మాజీ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై ఈ నెల 18న వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమనియన్ లతో కూడిన ధర్మాసనం రేపు తీర్పు వెలువరించనున్నది.
తేజ్ బహదూర్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ వారణాసి ఓటరు కాదని, వారణాసి ఎన్నికలలో పోటీ కూడా చేయలేదని అందువల్ల ఈ పిటిషన్ చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
తేజ్ బహదూర్ యాదవ్ బిఎస్ పి టిక్కెట్ పై వారణాసిలో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. బిఎస్ఎఫ్ నుంచి ఆయన ను అవినీతి ఆరోపణలపై తొలగించారా? లేక విశ్వాసం లేకపోవడం వల్ల తొలగించారా అనే అంశాన్ని తేజ్ బహదూర్ యాదవ్ స్పష్టం చేయనందున నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి అప్పటిలో ప్రకటించారు.
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పని చేస్తున్న సైనికులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడంపై తేజ్ బహదూర్ యాదవ్ రూపొందించిన వీడియో అప్పటిలో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ వీడియో బయటకు రావడంతో తేజ్ బహదూర్ యాదవ్ ను 2017లో బిఎస్ఎఫ్ నుంచి తీసివేశారు.