అసలే వర్షాకాలం… ఆ పై సీజనల్ వ్యాధులు విజృంభించే సమయం. అంతే కాకుండా కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న వేళ….. సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఇవేవే పట్టవు.
నిజంగా ప్రజలకు సేవ చేద్దామని, సేవాభావంతో పదవుల్లోకి వచ్చిన వారికి మాత్రం పరిస్థితి తలచుకుంటే ఒక్క క్షణం కూడా నిద్రపట్టదు. పదవి చిన్నదైనా పెద్ద పని చేసిన సాయు సుధను అభినందించకుండా ఉండలేం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ. తన గ్రామంలో ఎక్కడా చెత్త ఉండకుండా చూసుకుంటున్నారు ఆమె.
అంతే కాదు గ్రామంలో అన్ని రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రతి రోజూ పర్యవేక్షిస్తుంటారు. వ్యాధులు ప్రబలే ప్రస్తుత వర్షకాలంలో ముందస్తుగా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
అంతటితో ఆగకుండా ఈ మహిళా సర్పంచ్ వాటర్ ట్యాంకు పైకి ఎక్కి శుభ్రం చేసింది.
ఇప్పటికే గ్రామంలో వైకుంఠ దామం, పల్లె ప్రకృతి వనం, సైడ్ కాలువల నిర్మాణం, గ్రామంలో రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధను గ్రామస్తులు నవాబుపేట వీరనారిగా.. మరో రాణి రుద్రమదేవిగా ప్రశంసిస్తున్నారు.