ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంతో పాటు రాజధాని రైతులపై కక్షతోనే కౌలు ఎగ్గొట్టేందుకే వేధింపులకు ప్రభుత్వం పాల్పడుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏటా ఎకరాకు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయం పొందే రైతులు కేవలం ముఫై వేలు, నలభై వేల రూపాయల కౌలకే పొలాలు ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ళుగా వైకాపా ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులకు ఏనాడూ సక్రమంగా కౌలు చెల్లించలేదన్నారు.
పదే పదే రైతులను కోర్టు మెట్లు ఎక్కించి, ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ న్యాయవాదులకు అప్పళంగా దోచి పెడుతుందని ధ్వజ మెత్తారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల మూర్ఖపు కుతంత్రాన్ని రాజధాని రైతులు తిప్పికొట్టారని, సిఆర్డిఏ అధికారులను కోతి బొమ్మలను చేసి ఆటలాడిస్తున్నట్లు ఆరోపించారు. నవులూరు , పిచ్చుకలవారి పాలెం వంటి రాజధాని గ్రామాలలో ఎకర ఐదు కోట్లకు, ఆరు కోట్లకు ఈ- వేలం వేస్తున్నారన్నారు. ప్రభుత్వ మోసపూరిత ప్రకటనలను నమ్మి వేలం ద్వారా భూములను కొనుగోలు చేసే మదుపరులు రాబోవు ప్రభుత్వంలో నష్టపోతారని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా, న్యాయ బద్ధంగా పలు హక్కులు ఉన్న రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం కొనుగోలు దారుల గోడు పట్టించుకోరని బాలకోటయ్య హెచ్చరించారు.