జర్నలిస్టులపై కేసులు పెట్టి, విచారణ పేరిట నోటీసులు ఇచ్చి వేధించడం రాష్ట్ర ప్రభుత్వ అవివేక చర్య అని, జర్నలిస్టు మూర్తిపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతులు బాలకోటయ్య డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్టు మూర్తిని విచారణ పేరిట మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి సిఐడి అధికారులు రప్పించారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మూర్తిని కలిసి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో బ్యాంకులకు కన్నం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసిన వారిని, రుషికొండను గుండు చేసిన వారిని, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని వదిలేసి సాధారణ పాత్రికేయులను అరెస్ట్ చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఎలా పనిచేస్తాయో, మీడియా వస్తే కూడా చోదక శక్తి అని చెప్పారు. ప్రజల తరఫున మాట్లాడటమే నేరంగా భావించి ప్రభుత్వాలు అణిచివేతలకు పాల్పడితే నష్టపోతాయన్నారు. విచారణ సమయంలో సీసీ కెమెరాలు ఉండాలన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా పాటించక పోవటం అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. విచారణకు పిలిచి సిసి కేమెరాలు ఎందుకు పెట్ట లేదని సిఐడి అధికారులను ప్రశ్నించారు. కొల్లు అంకబాబు, కుండబద్దలు సుబ్బారావు, రంగనాయకమ్మ వంటి వారు ప్రభుత్వ విధానాలను
వ్యతిరేకించి భావప్రకటనా స్వేచ్ఛతో మాట్లాడిన వారిపై ప్రభుత్వం వేధించడం సరైనది కాదని, గత ప్రభుత్వ పాలనలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రతిపక్ష హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దారుణమైన దూషణలను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. అలలు తలలు దించవు. సముద్రం ఒకరి పాదాల దగ్గర మొరగదు అన్నట్లు కలాలు రాస్తునే ఉంటాయి. గళాలు మాట్లాడుతూనే ఉంటాయన్న సత్యాన్ని సిఐడి అధికారులు గ్రహించాలని పేర్కొన్నారు. మూర్తిపై కేసును ఉపసంహరించుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.