తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీసులు కేసు పెట్టారు. యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ పై కేసు ఏమిటి అనుకుంటున్నారా? ఆయన ఒక్కడి పైనే కాదు. చాలా మందిపై కేసులు పెట్టారు. కొందరిపై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. లోకేష్ తో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి , పులివర్తి నాని , ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తదితర నేతలపై కూడా కేసులు నమోదు చేశారు.
353,290,188,341,ipc సెక్షన్ల కింద లోకేష్ తో పాటు కీలక నేతలపై కేసు నమోదు చేశారు. పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేయడం గమనార్హం. నిన్న బంగారుపాళ్యం లో లోకేష్ పాదయాత్ర ను అడ్డుకున్న పోలీసులు ఈ మేరకు కేసులు కూడా పెట్టారు. బహిరంగ సభ జరగకుండా వాహనాల్ని సీజ్ చేశారు. దాంతో పక్కనే ఉన్న డాబా ఎక్కి లోకేష్ ప్రజలతో మాట్లాడారు.
పోలీసుల తీరును తప్పుపడుతూ తెలుగుదేశం కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు యువగళం వాహనాల్ని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. దాంతో కార్యకర్తలపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జయప్రకాష్, జగదీష్, కోదండ యాదవ్ మరికొందరు నేతలపై 307,332 143 ,341 ,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.