వెంకటేశ్వరస్వామి రాజకీయాలకు అతీతుడని ఎవరు అన్నారు? ఆయన కూడా రాజకీయాలకు అతీతుడు కాదు అని ప్రతి సారీ రుజువు అవుతూనే ఉంది. వేంకటేశ్వరస్వామి హుండీలో డబ్బులు వేయకండి, పింక్ డైమండ్ విదేశాల్లో వేలం వేశారు…. అంటూ అప్పటిలో తిరుమల ప్రధాన అర్చకుడు, ప్రస్తుతం ఆగమశాస్త్ర సలహాదారుడు వేంకటరమణ దీక్షితులు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
వేంకటరమణ దీక్షితులు చేసిన ఆరోపణలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు, కీలక నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సపోస్టు చేశారు. ఇవే కాకుండా అదనపు ఆరోపణలు కూడా విజయసాయి రెడ్డి చేశారు. దాంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు వీరిద్దరిపై రూ.200 కోట్ల మేరకు పరువునష్టం దావా వేసింది.
దీని కోసం రూ.2 కోట్ల రూపాయలు ఫీజు కింద చెల్లించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి వైసీపీ పగ్గాలు చేపట్టింది. దాంతో సదరు కేసును విత్ డ్రా చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డు ఒక నిర్ణయం తీసుకున్నది.
పాలకమండలి ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక తీర్మానం కూడా చేశారు. అయితే ఈ విషయం బయటకు రాలేదు. తిరుపతి 10వ అదనపు జిల్లా కోర్టులో కేసు నడుస్తున్నదనే అందరూ అనుకున్నారు. అయితే హిందూ జనశక్తి సంస్థ ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని భావించింది. ఈ మేరకు సదరు కోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసింది.
అసలు కేసే లేదు ఇక ఇంప్లీడ్ పిటీషన్ ఏమిటి? అనే ప్రశ్న వచ్చింది. అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది. పరువు నష్టం కేసు విత్ డ్రా చేసుకోవడంతో భక్తులు ఇచ్చిన డబ్బులు రెండు కోట్ల రూపాయలు గోవిందా గోవింద. ఇప్పుడు చెప్పండి వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు అతీతుడా????