అధికార పార్టీ అండదండలు చూసుకుని కొందరు రెవెన్యూ ఉద్యోగులు తిరుపతి పరిసర ప్రాంతాలలోనే బదిలీలు చేయించుకుంటు కాలక్షేపం చేస్తున్నారని అందువల్ల రెవెన్యూలో అవినీతి పెరిగిపోతున్నదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొంతమంది గత 10 నుంచి 15 సంవత్సరాలుగా చిన్న స్థాయి ఉద్యోగం నుంచి వివిధ హోదాలలో ఇక్కడే పని చేస్తున్నారని ఆయన అన్నారు.
అటెండర్, సీనియర్ అసిస్టెంట్ లుగా డిప్యూటీ తాసిల్దారులుగా అలాగే తాసిల్దార్లుగా పదోన్నతులు పొందుతూ బదిలీ పేరుతో కేవలం తిరుపతి అర్బన్ నుంచి తిరుపతి రూరల్ కు తిరుపతి రూరల్ నుంచి చంద్రగిరి కి చంద్రగిరి నుంచి రేణిగుంట కి ఇలా 10 కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతున్నారని ఆయన అన్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అండదండలతో కొంతమంది ఇతర జిల్లాలకు కనీసం మదనపల్లి చిత్తూరు లాంటి డివిజన్లకు కూడా బదిలీ కావడం లేదు.
ఒకవేళ బదిలీ అయినా 6 నెలలు లేక సంవత్సరం తిరగకముందే తిరిగి అదే స్థానానికి వస్తున్నారు. దీని వల్ల అవినీతి పెరిగిపోతున్నదని ఆయన అన్నారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సీఎం కార్యాలయానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.
తిరుపతి,చంద్రగిరి శాసనసభ్యులు భూ ఆక్రమణలపై ఘాటుగా స్పందించారని, కొంత మంది అవినీతి అధికారుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని పద్ధతి మార్చుకోవాలని లేకపోతే వేటు తప్పదు అని ప్రత్యక్షంగా పత్రికాముఖంగా హెచ్చరించడం అభినందనీయమని ఆయన అన్నారు.
అలాగే ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నవీన్ కుమర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రతి 3 లేక 5 సంవత్సరాలకి ఒక సారి రెవెన్యూ చట్టం ప్రకారం అధికార పార్టీ నాయకుల సిఫార్సులతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా బదిలీలు జరగాలని ఆయన అన్నారు.