ప్రతి ఒక్క ఆంధ్రుడూ గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటంలో ఎందరో సమరయోధులు తమ ఆస్తులను, ప్రాణాలను జీవితాలను త్యాగం చేశారని, వారిలో అల్లూరి ఒకరని ఎమ్మెల్యే కోలగట్ల పేర్కొన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు.
అతి చిన్నవయసులోనే పోరాటబాట పట్టి గిరిజనులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమాయత్తంచేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన వ్యక్తిగా అల్లూరి దేశచరిత్రలో నిలిచివుంటారని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు శాంతియుత పోరాటం చేస్తే, తుపాకీకి ఎదురొడ్డి నిలబడి వీరోచిత పోరాటం చేసి తన ప్రాణాలనే అర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని పేర్కొంటూ భావితరాలు అల్లూరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజహితం కోరి పనిచేయాలన్నారు.
అల్లూరి మనతో సజీవంగా లేకపోయినా ఆయన ఆశయాలు, పోరాటస్ఫూర్తి ఎప్పటికీ నిలిచి వుంటాయన్నారు. అల్లూరి సేవాసమితి కోరిన మీదట మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ల సహకారంతో నగరంలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయగలిగినట్టు చెప్పారు. రానున్న రోజుల్లోనూ సేవాసమితి చేపట్టే కార్యక్రమాలకు పూర్తిసహకారం అందిస్తామన్నారు.