లోకకల్యాణార్థం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సెప్టెంబర్ 10వ తేదీ నుండి గీతా పారాయణం ప్రారంభించామని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు.
సుందరకాండ, విరాటపర్వం పారాయణాన్ని ఎస్వీబీసీ ద్వారా కోట్లాది మంది భక్తులు వీక్షిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో అనిల్కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
టిటిడి ఆదాయ వ్యయాల ఆడిటింగ్ను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసేవారని ఇకపై కాగ్ పరిధిలో ఆడిటింగ్ జరగాలని టిటిడి బోర్డు నిర్ణయించిందని ఆయన తెలిపారు.
పారదర్శకత పెంచడంలో భాగంగా ఆగస్టులో బోర్డు సమావేశాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశామని ఆయన వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
పెరటాసి మాసం కారణంగా భక్తుల రద్దీ పెరగడంతో తిరుపతిలో రోజుకు 3 వేల చొప్పున ఆఫ్లైన్లో జారీ చేస్తున్న సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్లైన్లో కోటా పెంచి రోజుకు 13 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేస్తున్నామని, నిధుల కోసమే టిటిడి ఇలా చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈవో అన్నారు.
ఆన్లైన్ కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు(ఇద్దరు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించామని ఆయన తెలిపారు.
కోవిడ్ కారణంగా శ్రీవారి ఆర్జిత సేలను రద్దు చేయడం వల్ల ఇప్పటికే ఉదయాస్తమాన సేవ మరియు వింశతి వర్ష దర్శిని(వివిడి) పథకాల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు.