పసుపుకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ ఈ నెల 5న జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కాకపొతే ఇంకెప్పటికీ రాదు అనే నినాదంతో పసుపు రైతులు మద్దతు ధర కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, రైతుబిడ్డలు కులమతాలకు, రాజకీయలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షులు పన్నాల తిరుపతిరెడ్డి కోరారు. ఇది నీ కుటుంబానికి,నా కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు. సమస్త రైతులందరి సమస్య అని ఆయన అన్నారు. ఇది పంట చేతికి వచ్చిన సమయం. మరో పక్షం రోజుల్లో పంట అమ్ముకునే సమయం.
కాబట్టి పోరుబాట పట్టాల్సిన సమయం ఆసన్నం అయిందని ఆయన అన్నారు. అనవసర పథకాల మోజులో పడిన ప్రభుత్వాలు పసుపు పంటకు మద్దతు ధర కల్పించే విషయాన్ని మర్చిపోయిందని, అందువల్ల రైతులు సమైక్యంగా పోరాడి ప్రభుత్వానికి గుర్తు చేయాలని ఆయన కోరారు. 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.