ఆర్టీసీ కార్మికుల చారిత్రత్మక 55 రోజుల సమ్మె తర్వాత, ప్రభుత్వ వైఖరి మూలంగా వేతన సవరణలకు దూరమై, పెంచిన పని భారాలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులు గత సంవత్సరంనరకాలంగా రాష్ట్ర స్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటై నిర్వహించిన ఆందోళనలో ఐక్యంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కార్యదర్శి గడ్డం లింగమూర్తి పేర్కొన్నారు. ఖమ్మం లోని సిహెచ్.వి.రామయ్య స్మారక భవనంలో సిరిపురపు సీతారామయ్య అధ్యక్షతన ఏర్పాటైన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం డిపో కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని పాలక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటుపరం చేస్తూ, కార్మిక వర్గానికి అండగా ఉన్న చట్టాలను మారుస్తూ, మతోన్మాదంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో మతోన్మాద శక్తుల్ని కట్టడి చేయడం కోసం,లౌకిక వాద పరిరక్షణ,ప్రజా కోణంలో మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో వామపక్ష పార్టీలు తెలంగాణలో పాలక టిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికాయని తెలిపారు.
వామపక్షాల చొరవ మరియు ఆర్టీసీ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ నిర్వహించిన ఆందోళనల మూలంగా ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిందని ఫలితంగానే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడి మూడు డిఏలు, పండుగ అడ్వాన్సు,సకలజనుల సమ్మె కాలానికి వేతనం పొందుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడూ ఒంటరి వారు కాదని, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వామపక్ష పార్టీలు,కార్మిక సంఘాలు ఆర్టీసీ కార్మికుల పోరాటానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చినందున ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్ లో కార్మిక సమస్యల పరిష్కారం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఐక్య పోరాటాల ద్వారా అనేక కార్మిక సమస్యలు పరిష్కరించిన చరిత్ర ఖమ్మం రీజియన్ లో స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కు ఉందని తెలిపారు.
గత మూడు సంవత్సరాల కాలంలో కార్మిక సంఘాల కార్యకలాపాలు లేకుండా ఏర్పాటుచేసిన సంక్షేమ మండలి సభ్యులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోని కారణంగా కార్మికులు అనేక రకమైన సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. స్పెషల్ ఆఫ్ డ్యూటీ లను సింగల్ క్రూ డ్యూటీలుగా మార్చడం, కిలోమీటర్లు పెంచడం షెడ్యూల్స్ యొక్క రన్నింగ్ టైం తగ్గించి ఓవర్ టైమ్ లను తగ్గించిన మూలంగా కార్మికులు చేసిన శ్రమకు రావలసిన వేతనాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ నెలలోనే స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ మహాసభ జరగాల్సి ఉన్నదని అందువలన ఖమ్మం డిపో నిర్వహణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.