ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9న వరాహ జయంతి వేడుక జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారు చేసిన పంచామృతంతో వేదోక్తంగా ఉత్సవర్లకు ఏకాంతంగా ఉదయం 9గం నుండి ఉదయం 10గం నడుమ తిరుమంజనం నిర్వహిస్తారు.
బాలాలయం జరుగుతున్న కారణంగా మూలమూర్తికి ప్రోక్షణ నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.
స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.