భారత ఉప రాష్ట్ర పతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పారు.
వెంకయ్యనాయుడిని ఉద్దేశించి మనసు ఒక చోట, మనిషి ఒక చోట ఉన్నారంటూ విజయసాయిరెడ్డి రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై బిజెపి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలను ప్రస్తావించారు.
దేవాలయాలపై దాడులు తదితర అంశాలను ఆయన ప్రస్తావించారు. మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను కూడా రాజ్యసభ ముందు ఉంచారు.
దీనిపై సోమవారంనాడు జీరో అవర్ లో విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సభ్యుడు రాజ్యసభలో చెప్పకూడని అంశాలు చెప్పారని అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయిరెడ్డి కోరారు.
పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది ప్రసంగిస్తున్నప్పుడు లేవనెత్తాలి తప్ప ఆ తర్వాత లేవనెత్తడం కరెక్టు కాదని వెంకయ్యనాయుడు వివరించారు.
అయితే ఫిర్యాదును లిఖిత పూర్వకంగా పంపితే పరిశీలించి చర్యలు తీసుకుంటానని విజయసాయిరెడ్డికి హామీ ఇచ్చారు. ఆ సమయంలో వెంకయ్యనాయుడిపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ చైర్మన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని పార్లమెంటరి వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేడు మందలించారు.
రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు చెప్పాలని ప్రహ్లాద్ జోషి సూచించారు. దాంతో ఆవేశంలో మాట్లాడాను.. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను అని విజయసాయి రెడ్డి క్షమాపణ కోరారు. భవిష్యత్ లో ఈ విధంగా చేయనని కూడా విజయసాయిరెడ్డి తెలిపారు.