విభజన హామీలు పరిష్కరించాలని కోరేందుకు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారని చెబుతున్నా ఈ పర్యటనలో రహస్య ఎజెండా కూడా ఉందని అంటున్నారు. గత కొంత కాలంగా ఏపిలో ముందస్తు ఎన్నికలపై పలు ఊహాగానాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. పార్టీ ఇన్ చార్జీలను నియమించుకోవడం, పార్టీ సమావేశాలు నిర్వహించడం, గృహ సారధుల నియామకం వేగవంతం చేయడం లాంటి కార్యక్రమాలు వేగంగా చేస్తుండటంతో అధికార వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నదనే ఊహాగానాలు మరింత పెరిగాయి.
అతి త్వరగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించేసి ప్రజాకర్షక బడ్జెట్ పెట్టేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని కూడా అంటున్నారు. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా ఇదే విషయం చర్చించిన తర్వాత వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జగన్ ముందస్తుకు వెళతారని అంటున్నారు.
అదే విధంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రధానికి వివరించి, రాజకీయ అనివార్యతలను చెప్పి దానికి కూడా ప్రధాని అంగీకారం తీసుకోవాలని కూడా జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం తమకు ఇబ్బంది కలిగిస్తున్నదని కూడా జగన్ ప్రధానికి వివరించినట్లు చెబుతున్నారు.
మూడు రాజధానుల అంశమే తమకు ఎన్నికలలో కలిసి వచ్చేదని, అందువల్ల బీజేపీ అందుకు అడ్డుపడకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. ముందస్తు, మూడు రాజధానుల అంశాలను ప్రధాన ఎజెండాగా ఢిల్లీ యాత్ర పెట్టుకున్న జగన్ ఎంత వరకూ సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.