అత్యంత కీలకమైన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును ఊడబెరికిన తర్వాత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఏం చేస్తున్నారు? ఏమో తెలియదు కానీ ఆయన మాత్రం సచివాలయానికి రావడం లేదని అంటున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారని మరి కొందరు అంటున్నారు.
ప్రవీణ్ ప్రకాష్ భార్య ఐపిఎస్ అధికారి. ఆమె ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఇన్ చార్జిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఆయన తలలో నాలుకలా ఉన్నారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం ఉన్న సాధారణ పాలన ముఖ్య కార్యదర్శి పదవిలో ఆయన కొనసాగుతూనే ముఖ్యమంత్రి వద్ద ముఖ్య కార్యదర్శిగా కూడా పని చేశారు.
రెండూ అత్యంత కీలకమైన పదవులు కావడంతో ప్రవీణ్ ప్రకాష్ పరపతి ఆకాశాన్ని అంటింది. క్షణం తీరిక లేకుండా అధికారం చెలాయించిన ప్రవీణ్ ప్రకాష్ తనను ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ను కూడా పదవి నుంచి ఊడబెరికారు.
ఐఏఎస్ అధికారులు సీనియారిటీకి అత్యంత గౌరవం ఇస్తారు కానీ ప్రవీణ్ ప్రకాష్ మాత్రం తనకన్నా అత్యంత సీనియర్ అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యాన్ని తీరని అవమానానికి గురి చేశారు. చివరకు ఆయనకు అతి కీలకమైన ఆ పదవే దూరం అయింది. సాధారణ పరిపాలన ముఖ్యకార్యదర్శి పదవిలోకి తన కన్నా జూనియర్ అయిన అధికారిని జగన్ నియమించుకున్నారు.
దాంతో ప్రవీణ్ ప్రకాష్ కినుకవహించారని అంటున్నారు. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లిపోయారని, అప్పటి నుంచి తిరిగి రాలేదని అంటున్నారు. మరి కొందరు అయితే ప్రవీణ్ ప్రకాష్ ఇక ఉద్యోగంలో మళ్లీ చేరరని కూడా అంటున్నారు. దీనికి తోడు ఒక ప్రముఖ ఛానెల్ ప్రవీణ్ ప్రకాష్ రాజకీయాలలోకి వచ్చేస్తున్నాడంటూ ఒక వార్తను ప్రచారంలో పెట్టడంతో సాటి ఐఏఎస్ అధికారులు కూడా ప్రవీణ్ ప్రకాష్ ఏం చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణకు చెందిన ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆంధ్రాలో ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ ప్రకాష్ కూడా అదేపని చేస్తారని ఆ ఛానెల్ కథనం ప్రసారం చేసింది.
మరొక అడుగు ముందుకువేసి ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నారని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. ఆయన రాజకీయాలలోకి రావడం సంగతి ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ లో అహోరాత్రులు కష్టపడి పని చేసిన అధికారిని ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తీసేయడం యూజ్ అండ్ త్రోలా ఉందనే విమర్శలు మాత్రం ఎక్కువయ్యాయి.