భయపెట్టి ఎన్నాళ్ళు పరిపాలన సాగిస్తారని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాలకులను రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. కృష్ణాజిల్లా మోపిదేవిలో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు.
ముఖ్య వక్త బుద్దప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత, అవినీతిని పేదవాడు ప్రశ్నిస్తే రైస్ కార్డు, సంక్షేమ పథకాలు తీసేస్తామని, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యం పేదల మనిషి అని చెప్పుకునే సీఎం జగన్ విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరల భారంతో అదే పేదల నడ్డి విరుగుతుంటే కనీస స్పందన లేదన్నారు. పెరిగిన జీవన వ్యయం కారణంగా ఒక్కో కుటుంబంపై నెలకు సరుకులకే 3-4 వేలు అదనపు భారం పడుతోందన్నారు.
సినిమా టికెట్ల ధరల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రుల్లో ఏ ఒక్కరూ కూడా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి ఎందుకు మాట్లాడట్లేదని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించని ఏకైక రాష్ట్రం దేశంలో ఇదొక్కటే అన్నారు.
కఠినమైన నిర్ణయాలతో పేదల బతుకులు అద్వానం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి విపరీతంగా పెరిగిందన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని అడిగి అధికారం చేతికి వచ్చాక ఈ రాష్ట్రంపై భస్మాసుర హస్తం వేశారని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీ, సర్పంచులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.