35.2 C
Hyderabad
April 27, 2024 11: 13 AM
Slider ముఖ్యంశాలు

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

#pilivarthinani

ఓటమి భయంతో చరిత్రలో లేని విధంగా వైసీపీ దొంగ ఓట్ల దందాకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు  నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఓటరు జాబితాలో జరిగిన అవకతవకలు ఎన్నికల కమిషన్ కు కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు.  డెకాయిట్లు కూడా చేయని విధంగా బరితెగించి ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పులివర్తి నాని ఆర్డీవో కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకున్నారు.

ఈ నిరసనల్లో నాని గాయాలపాలయ్యారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు పులివర్తి నానిని చంద్రగిరిలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఎక్కడైనా ఓటరు లిస్టును ఎన్నికల అధికారులు చేస్తారు..కానీ దుర్మార్గంగా రాష్ట్రంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు చేర్చుతున్నారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగిస్తున్నారు. ఓట్ల అంశంలో రాష్ట్రమంతా ఏం జరుగుతోందో చూస్తే…చంద్రగిరి ఒక కేస్ స్టడీ. ఎన్నికల కమిషన్ కు చంద్రగిరి కేస్ స్టడీగా ఉంటుంది. ఇటీవల ఎన్నికల కమిషన్ తిరుపతి కలెక్టర్, ఎస్పీఏలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్ సభ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

విచ్చలవిడిగా ఫామ్-6, ఫామ్-7

దొంగఓట్ల చేర్పులు, టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై పులివర్తి నాని ఆరు నెలలుగా పోరాడుతున్నారు. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ రాక్షసులు చేసే పనులతో ఫ్రస్టేషన్ కూడా వస్తుంది. ఎప్పుడూ నా జీవితంలో ఇలాంటి నేరస్తులను చూడలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో ఫామ్-6, ఫామ్-7, ఫామ్ -8 ను విచ్చలవిడిగా ఉపయోగించారు. పోయినసారి 2.90 లక్షల ఓట్లతో 325 బూత్ లు ఉన్నాయి. ఇప్పుడు 3.08 లక్షల ఓట్లతో 75 బూత్ లు పెంచారు. తుమ్మలగుంటలో గతంలో నాలుగు బూత్ లు ఉన్నాయి..అవి ఇప్పుడు ఏడు బూత్ లు చేశారు.

వాళ్ల లెక్కల ప్రకారం మళ్లీ  నాడు 2.70 లక్షల ఓట్లు ఉంటే..ఇప్పుడు 3.08లక్షల ఓట్లు ఉన్నాయంటున్నారు. 38 వేల ఓట్లు కొత్తగా వచ్చాయి. ఇందులో ఫామ్ -6 ద్వారా 25 వేల ఓట్లు చేర్పించారు. 6 వేల మంది 40, 80 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు కొత్తగా ఎక్కడి నుండి వచ్చారో తెలీదు. 13,928 ఓట్లు ఫోటో సిమిలర్ ఎంట్రీ కింద ఉన్నాయి. సంగీతం హరి, హరి సంగీతం అనే పేరుతో తిరుపతి, చంద్రగిరిలో చేర్చారు. శ్రావ్య దువ్వాల..దువ్వాల శ్రావ్య అనే పేర్లతో శ్రీకాళహస్తి, చంద్రగిరిలో చేర్చారు. మల్లగుంట్ల మహేష్ పేరుతో పీలేరు, చంద్రగిరిలో ఓట్లు చేర్చారు. ఇవన్నీ చూస్తే ఎన్నికల అధికారులు ఎంతగా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారో తెలుస్తోంది. ఓట్ల అవకతవకలు చూడాల్సిన బాధ్యత మాది కాదు..ఉద్యోగులది. తప్పులు జరిగితే జైలుకు పంపించే అవకాశం ఉంది..అయినా అధికారులు తేలిగ్గా తీసుకున్నారు.

వైసీపీ నేతలకు పాస్ వార్డ్

సచివాలయ సిబ్బందిని నియమించి అవకతవకలకు పాల్పడుతున్నారు. పులివర్తి నాని చేసే ధర్మపోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. వైసీపీని ప్రజలు ఇంటికి పంపడం ఖాయం. అధికారులు కూడా చట్ట ప్రకారం చేయాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే బోను ఎక్కిస్తాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించి చేసిన అక్రమాలపై చర్యలు తీసుకునేలా చేస్తాం. 10 ఎన్నికలు చూశాను..ఎప్పుడూ ఇలాంటి అవకతవకలు చూడలేదు. వైసీపీ నేతలకు పాస్ వార్డు ఇవ్వడంతో ఎమ్మార్వో కార్యాలయంలో కూర్చుని నమోదు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల విధుల్లో ఉండదని ఎన్నికల కమిషన్ చెప్పింది. వాలంటీర్లు కూడా ప్రజలకు మేలు చేయడం వరకే ఉంటే గౌరవిస్తాం..ఒక పార్టీకే పని చేస్తే శిక్ష పడేలా చేస్తాం. అధికార యంత్రాగాన్ని నేరస్తులుగా తయారు చేస్తున్నారు. కుప్పంలో దొంగ ఓట్లు ఉంటాయంటున్నారు.. తప్పించుకోవడానికి దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల నిర్మాణానికి రూ.20కోట్లు

Satyam NEWS

ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు

Satyam NEWS

యాసిడ్ తాగి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment