రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణాలలో తమ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడతారా? అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ వ్యాఖలపై ఏపి ముఖ్యమంత్రి జగన్ ఏందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
మీ రెండు పార్టీల మధ్య రాజకీయ సంబంధాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను బలి చేస్తారా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ నీటి పథకాలైన రాజోలిబండ (ఆర్డిఎస్) అక్రమ ప్రాజెక్టులని కేసీఆర్ ఆరోపణలు చేస్తుంటే, తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్ పై వై ఎస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే ? తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఏపీకి, ప్రత్యేకంగా రాయలసీమకు అన్యాయం చేయాలనుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
కరువులో ఉన్న సీమ రైతులు సముద్రంలోకి వెళ్ళేనీటిని వాడుకోంటే అడ్డుకోవాలని తెలంగాణ కేబినెట్ లో చర్చించడం భాద్యతారాహిత్యమని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ప్రాంతాలుగా విడిపోదాం – ప్రజలందరం అన్నదమ్మలుగా ఉందాం అంటే ఇదేనా? అని ఆయన అన్నారు.
శ్రీశైలంలో వేల ఏకరాలు ఇచ్చి భూములు కోల్పోయి, ముంపునకు గురయ్యి కూడా తెలంగాణకు నీళ్లు ఇస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.