ప్రభుత్వ విధానాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తుండటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆనవాయితీగా మారింది. ఇప్పటికే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న అవకతవకలపై ఆందోళనలు వ్యక్తం చేయగా తాజాగా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
తన అనుచరులతో కలిసి ప్రభుత్వ యంత్రాంగంపై ఆయన నిరసన చేపట్టారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో అర్హులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయడం లేదంటూ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. ఇళ్ళ స్థలాలు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ భాస్కర్కి ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పంపిణీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దాంతో ఆయన ఆందోళన విరమించారు.