షోకాజ్ నోటీసు ఇచ్చి కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ను ఏం చేశారో తెలుసా? ఏం చేశారు పార్టీ నుంచి బహిష్కరించారా?
అలాంటి పనులు చేయలేక పాపం పార్లమెంటులో ఆయన సీటును మార్చారు. ముందు వరుసలో కూర్చొంటే ఆయన ప్రశ్నలు వేయడానికి అవకాశం వస్తుందని, అలాంటి అవకాశాలు ఇక ఆయనకు రాకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన సీటును వెనుక వరుసలోకి మార్చాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ను కోరారు.
ప్రస్తుతం ఆయన 4వ వరుసలో కూర్చుంటున్నారు. ఆయన నాలుగవ వరుసలో ఉన్నందుకు ఏదైనా అంశంపై మాట్లాడాలనుకుంటే చెయ్యి ఎత్తితే స్పీకర్ అవకాశం ఇచ్చే వీలు ఉంటుంది. ఇక నుంచి ఆ అవకాశం లేకుండా చేయడానికి వీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లాన్ వేసి ఆయనను 7వ వరుసకు మార్చాలని స్పీకర్ కు లేఖ అందచేశారు.
రఘురామకృష్ణంరాజు 4వ వరుసలో ఉండటం వల్ల గత ఏడాది కాలంలో పార్లమెంటులో 53 సార్లు వివిధ అంశాలపై మాట్లాడగలిగారు. ఎన్నో ప్రజా ప్రాధాన్యత ఉన్న సమస్యలను ఆయన పార్లమెంటులో లేవనెత్తారు. అలా ఆయన ప్రతి సారీ లేచి మాట్లాడకుండా ఏం చేయాలా అని ఆలోచించి ఆయన సీటును వెనుక వరుసకు మార్చాలని వైసీపీ నాయకులు ఈ చర్య తీసుకున్నారు.
ఏం ఫర్వాలేదు, నేను ఎక్కడ ఉన్నా నాకు మాట్లాడే అవకాశాలు వస్తూనే ఉంటాయి అంటున్నారు రఘురామకృష్ణంరాజు. ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన అన్నారు. తనను అనర్హుడిగా చేయడం చేతకాని వైసీపీ తన సీటు మార్చి తృప్తి పడుతున్నదని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.
సీటు మారినందు వల్ల ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ లలో తప్ప సాధారణ సమయాలలో జోక్యం చేసుకుని మాట్లాడే వీలు ఇక నుంచి రఘురామకృష్ణంరాజుకు ఉండకుండా చేశారు. అదీ సంగతి.