వై ఎస్ షర్మిల చేస్తున్న పని ఏ మాత్రం నచ్చని జగన్ రెడ్డి సొంత చెల్లెలు అయినా కూడా ఆమె పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలు పెట్టాడు. సొంత చెల్లెలు అయినా సరే ఆమెపై వ్యక్తిగత విమర్శలకు కూడా జగన్ తెరతీయడంతో ఆయన మనస్తత్వం ఏమైఉంటుందా అని నెట్టిజన్లు పలు రకాలుగా ఆలోచిస్తున్నారు.
వై ఎస్ షర్మిల తెలంగాణ లో తన సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన విషయం తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తన ఓటు బ్యాంకు చీలిపోవడం ఖాయమని తేలడంతో జగన్ రెడ్డికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. అలాగని షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తి వాటా ఇచ్చేస్తే సరిపోయేది. అయితే ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్లే జగన్ రెడ్డి ఆ పని చేయడం లేదు.
పోనీ సొంత బాబాయి వివేకానందరెడ్డి మర్డర్ కేసులో న్యాయం చేయమని అడుగుతున్న తన కుటుంబ సభ్యుల కోసం ఆ మర్డర్ కేసులో దోషుల్ని పట్టుకోవాలంటే కూడా జగన్ సంశయిస్తున్నారు. అలా చేయడం ఇష్టం లేదు. దాంతో తన కుటుంబం మొత్తం జగన్ రెడ్డికి దూరం అయిపోయింది.
అసలు విషయానికి వస్తే షర్మిల అన్న జగన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి పిలవడానికి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. లోపల అరగంట ఉంటే… కుటుంబంతో పావు గంట ఉన్నారని.. పెళ్లి కార్డు ఇచ్చి పిలుపులు పిలిచి వచ్చారని చెబుతున్నారు. అయితే షర్మిల కారు లోపలకు వెళ్తున్నవి.. బయటకు వస్తున్న వీడియోలు తప్ప.. ఆమె ప్యాలెస్ లో ఉండగా ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు.
నిజానికి షర్మిలతో ఎలాంటి వివాదాలు లేవని.. కుటుంబ పరంగా అందరం కలిసి ఉన్నామని చెప్పుకునేందుకు జగన్ రెడ్డి తన మార్క్ హావభావాలతో చెల్లిని ఆహ్వానిస్తారని.. తలపై చేయి పెట్టి ఎప్పట్లాగే నవ్వుతారని అనుకున్నారు. ఆ వీడియోలు బయటకు వదిలి… రెడ్డిగారి కుటుంబం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటారని కూడా అనుకున్నారు.
కానీ అలాంటి ప్రయత్నమే చేయలేదు. ఎలాంటి వీడియోలు.. పోటోలు బయటకు రాలేదు. వైసీపీ సోషల్ మీడియా నాలుగేళ్ల కిందటి నాటి ఓ సెల్ఫీ ఫోటోను వైరల్ చేస్తూ.. అది ఇప్పటిదేనని ఎప్పట్లాగే నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ సోషల్ మీడియా మాత్రం ఎగతాళి చేస్తోంది. జగన్ రెడ్డి తన చెల్లితో కనీసం ఆప్యాయంగా ఉంటానని నటించేందుకు కూడా ఆసక్తి చూపలేదని.. ఫోటోలు బయటకు రాకపోవడం బట్టి తెలిసిందని అంచనా వేస్తున్నారు. పిలుపుల తర్వాత షర్మిల మాట్లాడిన మాటలతో.. సరిగ్గా జగన్ రిసీవ్ చేసుకోలేదని.. సామాన్య జనం అంచనా వేస్తున్నారు.