ఆర్టీసీ కార్మికులపై తనకు ఎటువంటి కక్ష లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రేపటి నుంచి విధుల్లో సంతోషంగా చేరాలని కోరారు. ఎటువంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరవచ్చునని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్ ప్రయాణికులపై మాత్రం భారం మోపారు. టిక్కెట్ చార్జీలు పెంచారు. కిలోమీటర్కు 20 పైసలు పెంచుతున్నట్టు ఆయత తెలిపారు.
పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు. కార్మిక సంఘాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.