ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రేపు ఉదయం కలవబోతున్న సందర్భంగా అందరి కళ్లూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వైపే చూస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ, కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులు, తదుపరి జీవోలు హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు తీర్పు వెలువడిన రోజే తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా రమేష్ కుమార్ ప్రకటించి ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించారు. అయితే అదే రోజు రాత్రి ఆయన పదవిలో చేరినట్లు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
తర్వాత అడ్వకేట్ జనరల్ అసాధారణ రీతిలో మీడియా ముందుకు వచ్చారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నామని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసి రాష్ట్ర హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
అయినా రాష్ట్ర ప్రభుత్వం రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించేందుకు వీలు కల్పించలేదు. ఆ తర్వాత రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్ కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శిపై కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. మూడువారాల గడువు ముగిసిన తర్వాత కూడా మళ్లీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ లోపు రాష్ట్ర హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ విచారణకు వచ్చింది. గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందచేయమని హైకోర్టు డాక్టర్ రమేష్ కుమార్ ను ఆదేశించింది. రమేష్ కుమార్ సోమవారం ఉదయం గవర్నర్ ను కలవబోతున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు లలో జరిగిన విషయాలను గవర్నర్ కు వివరించనున్నారు. గవర్నర్ రమేష్ కుమార్ అందచేయబోయే వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కలిగిస్తున్నది.
ఆగమేఘాలపై పంపిన ఆర్డినెన్సుపై సంతకం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు లేఖ పంపినా కూడా అప్పటిలో గవర్నర్ రమేష్ కుమార్ పదవీ కాలం కుదింపు నకు సంబంధించిన ఆర్డినెన్సులపై సంతకాలు చేశారు. ఈ సారి గవర్నర్ ఏం చేయబోతున్నారు అనే అంశంపై పలురకాల ఊహాగానాలు ఉన్నాయి.
హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు స్టే నిరాకరణ నేపథ్యంలో గవర్నర్ చొరవ తీసుకుని రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రమేష్ కుమార్ వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ పంపుతారని మరి కొందరు అంటున్నారు.
గవర్నర్ నుంచి వచ్చిన లేఖ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ నిర్ణయం తీసుకోకపోయినా, ఆయన లేఖ పంపితే దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోకపోయినా అంశం మళ్లీ హైకోర్టుకు చేరే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.