రాజధానికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళ్తున్నట్లుగా ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ‘‘సాధారణంగా రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి.. కానీ అమరావతిలో అది నాకు కనిపించలేదు’’ అని సీతారాం అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు.
విమర్శలు చేస్తున్నవారు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకునేలా చట్టాన్ని మార్చేందుకు అధ్యయన కమిటీ వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన గత ప్రభుత్వాన్ని ప్రజలు తమ తీర్పుతో గుణపాఠం చెప్పారని పేర్కన్నారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధుల భాషపై స్పీకర్ తమ్మినేని ఆందోళన వ్యక్తం చేశారు.