సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ బీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది.
ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సమయంలో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారనేది ఆయనపై అభియోగం. ఆయన సస్పెన్షన్ ను క్యాట్ సమర్థించగా క్యాట్ తీర్పుపై ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం మేలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ను హైకోర్టు ఎత్తేసింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్ను పక్కన పెట్టింది. సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్లో ఉన్న జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తన వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఏబీ వెంకటేశ్వరరావు కూడా నేడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.