వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనపై ఏకపక్షంగా జరుగుతున్న దాడి విషయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఉద్యుక్తులయ్యారు. నేడు ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తనపై పార్టీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కూలంకషంగా వివరించనున్నారు.
తన హక్కులకు భంగం కలిగించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని ఆయన స్పీకర్ కు వివరిస్తారు. తన ప్రాణానికి హాని కలిగించే విధంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తనను బెదిరిస్తున్నారని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ కు వివరించనున్నారు.
తనకు రక్షణ కల్పించాలని లోక్సభ స్పీకర్ ను రఘురామ కృష్ణంరాజు కోరనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన హోంశాఖ సెక్రటరీ అజయ్భల్లాకు వివరించనున్నట్లు తెలిసింది. తనకు ప్రాణహాని ఉందని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరనున్నట్టు సమాచారం. ఈ మేరకు గతంలో స్పీకర్కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఆ లేఖను స్పీకర్ హోంశాఖ సెక్రటరీకి పంపారు. అయితే మరోసారి స్పీకర్, హోంశాఖ సెక్రటరీని కలిసి తన రక్షణ చర్యలపై రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేయనున్నారు.