స్వంత నియోజకవర్గంలోని వెదురుకుప్పంలో సర్పంచిని పోటీ చేయించలేని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని కావాలని కలలుకనడం మానేయాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి హితవు పలికారు.
అక్రమమార్గాలలో మెజారిటీ పంచాయతీలలో గెలిచిన తరువాత నారాయణస్వామి జగన్ ఒకసారి ప్రధాని కావాలని చెప్పారు. అయితే మండల కేంద్రమైన వెదురుకుప్పం పంచాయతీలో వైకాపా తరపున అభ్యర్ధిని పెట్టలేదన్న నెపంతో మండల పార్టీ అధ్యక్షుడు పి ధనంజయ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రామచంద్రా రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు.
అక్కడ టిడిపి మద్దతుతో సర్పంచ్ గా గెలిచిన ఎం శిల్పను ప్రలోభపరచి పార్టీలో చేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు అని ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఆమె తండ్రి రామయ్య నిజాయతీ పరుడైన టిడిపి అభిమాని కావడంతో అది వీలు కావడంలేదని ఆయన వివరించారు. నారాయణ స్వామికి సత్తావుంటే పెనుమూరు మండలంలోని సాతంబాకం, చిన్నమరెడ్డి కండ్రిగ పంచాయతీలలో పార్టీ రెబల్ అభ్యర్థులుగా పోటీచేసినవారిని కూడా బహిష్కరించాల్సి ఉందని అయితే అయితే వారికి మాజీ ఎంపి ఎం. జ్ఞానేంద్ర రెడ్డి అశీస్సులు ఉన్నందున అయన భయపడుతున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.
రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ స్థాయి వ్యక్తిని పోటీ పెట్టినా నారాయణ స్వామి ఓడిపోతారని ఆయన తెలిపారు.
కాగా తిరుమలలో శనివారం శ్రీవారిని దర్శించుకున్న నారాయణస్వామి ఓటర్లకు లడ్డు ప్రసాదాల పంపిణీపై సమాచారం లేదని తప్పించుకోవడం హాస్యాస్పదమని ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్లు ప్రసాదాలు తీసుకువస్తే అక్కడే ఉన్నవారికి పంపిణీ చేశామనడం వాస్తవాలను కప్పిపుచ్చడమని, ఇకనైనా నారాయణస్వామి నేలవిడిచి సాముచేయడం మానేస్తే మంచిదని సుధాకర్ రెడ్డి అన్నారు.