సంక్షేమంతో పాటు అభివృద్దికీ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. సుమారు 7.93 కోట్ల వ్యయంతో, కలెక్టరేట్ నుంచి స్టేట్బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వరకు నిర్మించనున్న, ఆర్ అండ్ బి రహదారి పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ, అభివృద్ది ఫలాలను అందరికీ అందించాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గడపగడపకూ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సామాజిక, వ్యక్తిగత సమస్యలను సైతం తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం ఇప్పటికే పట్టణంలో పలు రహదారులను నిర్మించడం జరిగిందన్నారు. మయూరి జంక్షన్ నుంచి బాలాజీ జంక్షన్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి పాల్నగర్ రహదారులను త్వరలోనే అభివృద్ది చేస్తామన్నారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రస్తుత రహదారి సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరిగిందన్నారు.
కొత్తపేట రోడ్డును కూడా త్వరలోనే అభివృద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. జరుగుతున్న అభివృద్దిని పరిరక్షించాలని, ప్రజలకు కోలగట్ల విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సి డాక్టర్ పి.సురేష్బాబు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్ ఇసరపు రేవతీదేవి, వార్డు కార్పొరేటర్ పట్నాన పైడిరాజు, ఇతర కార్పొరేటర్లు, పార్టీ జోనల్ ఇన్ఛార్జిలు డాక్టర్ విఎస్ ప్రసాద్, దూబే, తదితరులు, ఆర్అండ్బి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.