హైదరాబాద్కు తలమానికమైన శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు వివరాలను మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సుమారు 31 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సుమారు రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. రాయదుర్గం–ఎయిర్పోర్టు మెట్రో రైలు ఏర్పాటైతే ఐటీ కారిడార్ నుంచి విమానాశ్రయానికి చేరుకునేవారికి దూరాభారం, సమయం తగ్గుతాయి. ప్రస్తుతం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతోంది. మెట్రో రైళ్లలో 25 నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను కూడా గతంలోనే ఏర్పాటు చేశారు.
previous post
next post