ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడు? అని కృష్ణ జిల్లా ఎస్.పి జాషువా ప్రశ్నించారు. గన్నవరం పరిణామాలపై ఆయన వ్యాఖ్యలు చేస్తూ పట్టాభిని పోలీసులు కొట్టారు అనే ఆరోపణ అవాస్తవం అని ఆయన అన్నారు. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవపట్టించాలని చూసారు.
రెండుమార్లు డాక్టర్ల బృందం పరీక్షించినా ఎటువంటి గాయం లేకపోవడంతో పట్టాభి వ్యూహం విఫలమైంది. ఇన్స్పెక్టర్ కనకరావు గాయపడిన సంఘటనపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. దీనికి ఏం సమాధానం చెపుతారు? ఇన్స్పెక్టర్ కనకరావు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా కొందరు నాయకులు ఆయన బిసీ అనే వివాదాన్ని లేపడం అర్ధ రహితం. కనకరావు కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది.
ఇకనైనా అవాస్తవాలను ప్రాచుర్యం చేయడం ఆపి, కోర్టు ఆదేశాలను గౌరవించండి అని ఆయన కోరారు. కోర్టు వారు పట్టాభి ఇతర నిందితులను రిమాండుకు పంపడం, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందనడానికి నిదర్శనం అని ఆయన తెలిపారు. లేనిపోని అభాండాలు వేయడం ద్వారా పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తియ్యలేరని ఆయన అన్నారు. పట్టాభి వచ్చీ రాగానే మరింత మంది జనాలను పోగేసి పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగాడు.
పట్టాభి ప్రవర్తనలో గొడవలు సృష్టించాలనే అతని దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకూ తెలుగు దేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి విషయం లో ఫిర్యాదు ఇవ్వలేదు. అయినా పోలీస్ వారు, రాయిటింగ్, అర్సన్ వంటి కఠినమైన సెక్షన్లతో సూమోటోగా కేసు నమోదు చేశాం. నిందితులను వీడియో ఫుటేజీ ద్వారా గుర్తించి, ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసాం. మిగిలిన ముద్దాయిలను గుర్తించి, అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఆయన తెలిపారు.