వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖిహార్ వద్ద శాంతియుతంగా చేస్తున్న రైతుల నిరసన ధర్నాపై దాడి అమానుషమని వామపక్ష రైతు సంఘాలు విమర్శించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో వామపక్ష రైతు సంఘాలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు, తన అనుచరులైన బిజెపి, ఆర్ఎస్ఎస్ గుండాలతో రైతులపై విరుచుకుపడి ఎనిమిది మంది రైతుల మృతికి కారణమయ్యాడని వారు ఆరోపించారు. 100 మంది దాకా క్షతగాత్రులు కావడానికి కారణమైన కేంద్ర సహాయ మంత్రి కుమారుడిని, తన అనుయాయులను తక్షణమే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వారు కోరారు. ఏంజెల్ టాకీస్ వద్ద నుండి ఆర్ డి ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి తదనంతరం ఆర్ డి ఓ కి మెమోరాండం ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఘటనను ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాలని, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 11 నెలలుగా రైతులు చేస్తున్న పోరాటం రైతులదే కాదని దేశ ప్రజలందరి సమస్యలని వారన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు రాకపోగా రైతులపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ శివకుమారి, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, కౌలు రైతుల సంఘం నరసరావుపేట మండల కార్యదర్శి కోండ్రు ఆంజనేయులు,
సిఐటియు మండల కార్యదర్శి షేక్ సిలార్ మసూద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాస రాంబాబు, నరసరావుపేట ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, ఏ ఐ టి యు సి నాయకులు వెంకట్, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్ధన రావు ఉత్తరప్రదేశ్ ఘటనలను ఖండించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బి రెడ్డి పుల్ల రెడ్డి, ఎల్ఐసి ఏజెంట్ యూనియన్ నాయకులు సయ్యద్ రబ్బాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ కన్వీనర్ జిలాని మాలిక్, మహమ్మద్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.