తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొరపాటున ఏదైనా హాని జరిగితే నాతో సహా మా పార్టీ నాయకులందరినీ ప్రజలు తగలెట్టేస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడుకు హాని కల్పించవద్దు. అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదు.. ఇంకా చెత్త సోది అంతా చెప్పవద్దు. జగన్మోహన్ రెడ్డి చంచల్గూడా జైల్లో సకల రాజభోగాలు అనుభవించారు. అవన్నీ బయటకు చెప్పేయమంటారా?… ఎన్ని ఐస్ క్రీములు తిన్నారో… ఇంకా ఏమేమి చేశారో తెలుసు… చంద్రబాబు నాయుడుకు జైల్లో తగిన సౌకర్యాలను కల్పించండి. ఎలాగో బుధవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన జైలు నుంచి విడుదల కావడం ఖాయమని అన్నారు.
నాకు జరిగిన అన్యాయమే… చంద్రబాబు నాయుడు కి జరగవద్దు
జైలు లో నాకు జరిగిన అన్యాయమే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కి జరగవద్దని… తక్షణమే చంద్రబాబు నాయుడుకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు వైద్యం అందించేందుకు జి జి హెచ్ లో రూమ్ రెడీ చేస్తున్నామని చెబుతున్నారు. అక్కడ కూడా ఇటువంటి దొంగ రిపోర్టులే ఇస్తారు. చంద్రబాబు నాయుడుకు డి హైడ్రేషన్ లేదు. బాగానే ఉన్నారని చెబుతారని, అందుకే ఆయనకు మెరుగైన వైద్య అందించడానికి ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలి. గతంలో నా ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చినవి దొంగ రిపోర్టులని మిల్ట్రీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ పెద్దలు ఏది చెబితే జి జి హెచ్ వైద్యులు అదే నివేదిక ఇస్తారు. జి జి హెచ్ వైద్య విభాగాల హెడ్ లు దొంగ నివేదికలపై సంతకాలు చేయడానికి నిరాకరించినప్పటికీ, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ వారిపై ఒత్తిడి చేశారు. సునీల్ కు ఆ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది. 12 గంటలకు వైద్య నివేదికలు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించగా, కోర్టుకు ఏడు గంటలకు వైద్య నివేదిక సమర్పించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రభావతి, సునీల్ కుమార్ పై సుమోటోగా న్యాయస్థానం కోర్టు ధిక్కరణ పిటిషన్ మూవ్ చేసింది… న్యాయస్థానమే సుమోటోగా పిటీషన్ మూవ్ చేసినప్పుడు ఆ కేసు ను విచారించి వారికి శిక్ష పడే విధంగా న్యాయస్థానం బాధ్యతలను తీసుకోవలసిన అవసరం లేదా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దేశంలో చట్టాలు చేసే, ఒక చట్టసభ ప్రతినిధి పరిస్థితి ఇలాగ ఉంటే… సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని నిలదీశారు.. చంద్రబాబు నాయుడుకు నాకు జరిగిన అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పై అభిమానంతోనే ఇదంతా చెబుతున్నానని తెలిపారు.
పెద్దాయన బరువు 72 కేజీలు…
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నేను కూడా పాల్గొన్నాను. అప్పుడే పెద్దాయన ను మీ బరువు ఎంత సార్ అని అడిగాను. దానికి ఆయన 72 కేజీలని సమాధానం చెప్పారు. మీ హైట్ కు మీరు మరో 10 కేజీల బరువు పెరగవచ్చు కదా అని సూచించగా… బరువు తగ్గకుండా, పెరగకుండా ఇదే బరువును కొనసాగిస్తానని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు 66 కేజీల నుంచి కేజీ పెరిగి 67 కు చేరుకున్నారని జైలు అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లుగా 34 రోజుల వ్యవధిలో జ్యూడిషియల్ రిమాండ్ లో ఆయన ఐదు కేజీల బరువు తగ్గారన్నది వాస్తవం. ఇది ఎంతో ప్రమాదకరం. వేగంగా ఇంత బరువు తగ్గడం అనేది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడు డయా బెటిక్ పేషంట్ అని ఆయనకు వారానికి ఒకసారి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా జైలు అధికారులు పేర్కొనడం పరిశీలిస్తే పెద్దాయన ఆరోగ్యం పట్ల వారు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు శరీరంపై దద్దులు ఉంటే క్రీమ్ అందజేశామని చెబుతున్నారు. అంతకంటే ఆయన వ్యక్తిగత వైద్యున్ని పిలిచి మాట్లాడించి ఉంటే బాగుండేది కదా?!. జగన్మోహన్ రెడ్డికి చంచల్గూడా జైల్లో లేని సౌకర్యం అంటూ లేదు. ప్రతిరోజు 30 మందితో మూలాఖత్ సౌకర్యాన్ని కల్పించారు. కానీ చంద్రబాబు నాయుడుకి వారానికి రెండు సార్లు మాత్రమే, అది కూడా ముగ్గురిని మాత్రమే మూలాఖత్ పేరిట జైలు అధికారులు అనుమతిస్తున్నారు . జగన్మోహన్ రెడ్డి జైలుకే ఐస్ క్రీములు తెప్పించుకొని తినేవారు. వంట చేయడానికి ఒక ప్రత్యేక మనిషిని ఏర్పాటు చేశారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఈ దుష్ట పరిపాలకులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.