ఎపిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక కుట్ర చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
కుక్క తోక వంకర పోదన్నట్టు జగన్ వంకర బుద్ధి, దౌర్జన్యకర దృక్పథం మారదని ఆయన చెప్పారు.
గ్రామాల్లో కక్షలు తగ్గించడానికి ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహాలు ప్రకటించడం కూడా ఇందులో బాగమే అన్నారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ముందు నుంచీ అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, అయితే ఈ సాకు చెప్పి ఎక్కువ ఏకగ్రీవాలు సాధించాలన్న వంకతో భయపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
గతంలో వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగించిన అక్రమ పద్దతులే ఇప్పుడు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
మంగళవారం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్నిగ్రామాల్లో వైకాపా నేతలు బెదిరింపులు ప్రారంభించారని ఆరోపించారు.
వైకాపా వారిపై పోటీకి దిగే ప్రతిపక్ష పార్టీల వారిని సామ, దాన, బేధ ,దండోపాయంతో లొంగదీసుకునేందుకు పలు చర్యలు ప్రారంభించారని తెలిపారు.
నామినేషన్లు వేయాలనుకునే వారిని గుర్తించి భయపెట్టడం, డబ్బు ఆశ చూపడం, కాంట్రాక్టర్లకు ఆగివున్న బిల్లులు ఇప్పించడం లాంటివి చేస్తున్నారని తెలిపారు.
అలా కాదని ఎదురు తిరిగిన వారిపై పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు వెనక వుండి అక్రమ వ్యవహారాలు నడిపించేలా జగన్ ఆదేశించినట్టు తెలిసిదన్నారు.
ఇలాంటి అప్రజాస్వామిక, దౌర్జన్యకర చర్యలకు పాల్పడేవారికి కొమ్మకాసే అధికారులు, పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు.
గత ఎన్నికల్లో తప్పుచేసిన అధికారుల పరిస్థితే ఇందుకు తార్కాణం అన్నారు.
ఇలాంటి సంఘటనలు జరిగితే ఎదుర్కొని కార్యకర్తలకు అండగా ఉండేందుకు నాయకుడు చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారని సుధాకర్ రెడ్డి చెప్పారు.