ప్రముఖ సినీ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం శ్రోతల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో విజయనగరం పూల్ బాగ్ కాలనీలో ఏర్పాటుచేసిన బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. పూల్ బాగ్ లో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలు విగ్రహ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విగ్రహ దాత సాయిబాబాను ఆయన సమచిత రీతిలో సత్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ సాధారణంగా చలనచిత్ర రంగంలో కథానాయకులకు మాత్రమే అభిమానులు ఉంటారని కానీ సినీ నేపథ్య గాయకుడైన ఎస్పీ బాలుకు అశేష మంది అభిమానులు ఉండడం విశేషం అన్నారు. కరోనా బారిన పడి మరణించడం దురదృష్టకరమన్నారు. ఎస్పీ బాలు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా అమర గాయకుడిగా అందరి హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. అటువంటి మహా గాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏ సంస్థనైనా ప్రోత్సహించేందుకు ముందు ఉంటామన్నారు. స్పార్క్ సొసైటీ చేస్తున్న సామాజిక హిత కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డిప్యూటీ స్పీకర్ కోలగట్లను ఉచిత రీతిన సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్పార్క్ సొసైటీ కన్వీనర్ పద్మనాభం, డివిజన్ కార్పొరేటర్లు వజ్రపు సత్య గౌరీ, బండారు ఆనందరావు, మారోజు శ్రీను వాసరావు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.