సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఆయనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ సమయంలోనే సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని సుప్రీంకోర్టుకు చెప్పారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది.
రేపటిలోగా అన్ని వివరాలతో రావాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్ననే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు నిన్ననే స్పష్టం చేసింది. నేడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సస్పెషన్ విధించిన రెండేళ్ల తర్వాత కొనసాగింపు కుదరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.