40.2 C
Hyderabad
April 28, 2024 15: 23 PM
Slider ముఖ్యంశాలు

వై నాట్ 175కు టీడీపీ కౌంటర్: పులివెందుల నుంచి డాక్టర్ సునీత?

#chandrababu

తనకు కుప్పంలో చెక్ పెట్టేందుకు ‘‘వై నాట్ 175’’ క్యాంపెయిన్ చేపట్టిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలోనే ఫుల్ స్టాప్ పెడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నా అందుకు తెలుగుదేశం పార్టీకి పరిస్థితులు అనుకూలించలేదు. పులివెందులలో స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నా కూడా వివిధ కారణాలతో వారు ప్రభావం చూపించలేకపోతున్నారు.

పైగా అక్కడ వై ఎస్ కుటుంబం ఆధిపత్యాన్ని సవాల్ చేయాలంటే మామూలు విషయం కూడా కాదు. మామూలు పరిస్థితుల్లోనే అక్కడ వై ఎస్ కుటుంబం హవా నడుస్తుంటుంది. ఇప్పుడు అధికారం చేతిలో ఉన్న జగన్ తనకు ఎవరైనా అడ్డు వస్తే చూస్తూ ఊరుకోరు. అధికారంలో లేకపోయినా పులివెందులలో పోలీసులు నామ మాత్రంగానే ఉంటారు. ఇక ఇప్పుడు పరిస్థితి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

2019 ఎన్నికల్లో జగన్ అక్కడ 80 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఆయన మెజారిటీ లక్ష దాటుతుందని వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అయితే చంద్రబాబును రెచ్చగొట్టి కుప్పంలో చెక్ పెట్టాలనుకుంటున్న తరుణంలో చంద్రబాబునాయుడు కూడా ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. పులివెందులలో వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగిన తర్వాత పరిస్థితుల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి.

సీబీఐ అధికారులే పారిపోతున్న తరుణంలో……

వివేకానందరెడ్డి దారుణ హత్యకు ఆయన కుమార్తె, అల్లుడే కారణమని వైసీపీ కీలక నేతలు బాహాటంగానే విమర్శలు చేశారు. నా తండ్రిని నేనే చంపుకుంటానా అని ప్రశ్నించే వివేకా కుమార్తె డాక్టర్ సునీత గోడు వినేనాధుడే లేకుండా పోయాడు. కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులనే పులివెందుల నుంచి పారిపోయేలా చేస్తున్న ప్రస్తుత సమయంలో డాక్టర్ సునీతకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

అత్యంత కిరాతకంగా తన తండ్రిని చంపిన వారు ఉన్నత పదవుల్లో ఉత్సాహంగా ఉంటే తాను మాత్రం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఎందుకు ఉండాలని ఆమె పదే పదే ప్రశ్నించుకుంటున్నారు. పులివెందులలో వై ఎస్ వివేకానందరెడ్డికి ఆ కుటుంబంలో అందరి కన్నా మంచి పేరు ఉద. అలాంటి తన తండ్రిని అతి కిరాతకంగా నరికి చంపిన హంతకులను న్యాయపరంగా అన్ని విధాలుగా సునీత ఎదుర్కొంటున్నారు. అయితే రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ఆమె ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంత కాలం పులివెందుల గురించి ఆలోచించడం కూడా అనవసరమని భావించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అటుగా ఆలోన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబునాయుడు పులివెందులపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అధికారంలో ఉండి తన తండ్రి హత్యను మరుగున పడేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఎదురు సమాధానం చెప్పేందుకు సిద్ధపడిన సునీతమ్మను చేరదీస్తే ఎలా ఉంటుందనే అంశంపై చంద్రబాబునాయుడు దృష్టి సారించారు.

ఇందుకు సంబంధించిన ప్రాధమిక చర్చలు కూడా పూర్తి అయినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున కడప పార్లమెంటు అభ్యర్ధిగా డాక్టర్ సునీత ను రంగంలో దించుతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అందుకు సునీతమ్మ నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో సునీతమ్మను పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా రంగంలో దించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది.

దీనికిసునీత నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబునాయుడు పులివెందుల గురించి బహిరంగంగా ఇప్పుడు సవాల్ చేస్తున్నారని అంటున్నారు. డాక్టర్ సునీత పులివెందుల నుంచి తెలుగుదేశం పార్టీ తరపున రంగంలో దిగితే కుప్పం సంగతి ఎలా ఉన్నా పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి పూర్తి దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

Related posts

ఒకే ఒక్క రోజు ఒక గంట వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వానికి 34 వేలు..

Satyam NEWS

ఆకౌంట్లో పడ్డ డబ్బులు వాపసు పోవు

Satyam NEWS

భ‌వానీ మాలధారులు బెజ‌వాడ‌కు వెళ్ల‌కుండానే “అమ్మ”‌ ద‌ర్శ‌నం

Satyam NEWS

Leave a Comment