ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన భూ లావాదేవీలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడంతో సమస్య పెద్దదై హత్యయత్నం వరకూ వెళ్లింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కె కన్నాపురం లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి భూమిని ఇంకో వ్యక్తి కొనుగోలు చేశాడు. కొంత మేరకు నగదు చెల్లించి మరి కొంత భాగానికి చెక్కు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఘటన వివాదంగా మారింది. వారిరువురి మధ్య నెలకొన్న పేచీ పంచాయతీ కి దారి తీసింది. కొనుగోలు చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా చెబుతున్నారు.
దాంతో ఈ వివాదంలో వైసీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు కూర్చున్నారు. ఆ భూ పంచాయతీ వ్యవహారం కాస్త రెండు రాజకీయ పార్టీ ల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక దశలో ఒకరి పై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు పెట్రోలు జల్లుకున్నారు. ఒక మహిళ వ్యతిరేక వర్గం పై పెట్రోలు పోయడంతో అక్కడి వ్యక్తులు భయకంపితులయ్యారు. ఇరు వర్గాలు పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారని పెదవేగి ఎస్ ఐ లక్ష్మణ్ బుధవారం రాత్రి తెలిపారు. ఇరు వర్గాలు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపి కేసులు నమోదు చేస్తామని ఎస్ ఐ చెప్పారు. ఈ కేసులు ఎటు దారితీస్తాయోనని గ్రామంలో ఆందోళన నెలకొని ఉన్నది.