37.2 C
Hyderabad
May 2, 2024 11: 50 AM
Slider ప్రత్యేకం

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

#VizagSteel

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంపూర్ణంగా రంగం సిద్ధమై పోయింది. దీన్ని అడ్డుకోడానికి ఆందోళనలు, నిరసనలు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, సకల ప్రజా సంఘాలు, యావత్తు ఆంధ్రజగతి ఉద్యమస్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నారు.

ప్రైవేటీకరణ ద్వారానే ప్రగతిరథ చక్రాలు పరుగులెత్తుతాయానే విశ్వాసంతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే చాటిచెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వపు మెడలువంచే బలం  మన పార్టీలకు లేనేలేవన్నది చేదునిజం.

స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామనే అంశం కంటే, దీన్ని అడ్డం పెట్టుకొని సొంత ప్రాపకం, ప్రచారం పెంచుకోవడం, సొంత రాజకీయాలు చేసుకోవడం,అధికార, విపక్షపార్టీలు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే సరిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ పార్టీలు తప్ప అందరూ నిజాయితీగా పని చేస్తున్నారు

విద్యార్థులు,యువత, కొన్ని ప్రజాసంఘాలు,మేధావులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు లక్ష్యం వైపు నిజాయితీగానే ఉన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాయడం,తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్షకు దిగడం, గంటా శ్రీనివాస్ రాజీనామాను ప్రకటించడం, స్థానిక బిజెపి నేతలు మద్దతును ప్రకటించడం, జనసేన నేత పవన్ కళ్యాణ్  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడడం నిజమో నాటకంలో భాగమో కాలం నిర్ణయించాలి.

ప్రస్తుతం జరుగుతోన్న ఉద్యమాలను చూస్తుంటే? ఒక్కొక్కరూ ఒక్కొక్క దుకాణం పెట్టుకొన్నట్టుగానే ఉంది. ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్న నాయకుల పట్ల ప్రజా విశ్వాసం అంతంత మాత్రమే. నిజాయితీని నింపుకొని, ప్రజల్లో విశ్వాసాన్ని, కేంద్ర ప్రభుత్వానికి భయాన్ని కలిగించిననాడే ఆందోళనలకు అర్ధం చేకూరుతుంది, ప్రజా ప్రయోజనం నెరవేరుతుంది.

రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి ఈఏఎస్ శర్మ వంటివారు ఉద్యమానికి నాయకత్వం వహిస్తే, ప్రజా విశ్వాసం పెరుగుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ సాంకేతికంగా విశాఖపట్నంలో ఉన్నప్పటికీ, ఇది కేవలం ఉత్తరాంధ్రకే సంబంధించింది కాదు. ఇది ఆంధ్రుల ఉమ్మడి ఆస్తి. ఈ ఉక్కుపై మనందరికీ హక్కు ఉంది.

ఆనాటి నేతలు ఇందిరాగాంధీనే వంచారు

అప్పుడు,తేన్నేటి విశ్వనాథం వంటి సత్ శీలురు, అమృతరావు వంటి దేశభక్తుల నాయకత్వంలో ఉద్యమం ఉప్పెనై ఎగిసింది. వీరిపై ఉండే అచంచలమైన విశ్వాసంతో ఆంధ్రప్రజ యావత్తు వీరితో కలిసి నడిచింది. ఇందిరాగాంధీ వంటి ఉక్కుమహిళ కూడా దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్, ప్రకటన, స్థాపన నాటి కేంద్ర ప్రభుత్వాలకు అనివార్యమైంది.

ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అప్పటి ఎంపీలు, ఎంఎల్ఎలు ఎందరో రాజీనామాలు చేశారు.ఐనప్పటికీ కేంద్రం కరుగలేదు. నిజంగా,రాజీనామాలకు ఆ కాలంలో విలువ ఉంది. ఆ నాయకుల పట్ల విశ్వాసం ఉంది. నేటికాలపు రాజీనామాలకు ఎటువంటి విలువ వుందో, ఏ మాత్రం ఫలితాలు వచ్చాయో, నిన్నటి సమైక్యాంధ్ర ఉద్యమమే పెద్ద ఉదాహరణ.

నాటి ఉక్కు ఉద్యమ కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తప్ప, మిగిలిన పార్టీలన్నీ ఉద్యమాన్ని హోరెత్తించాయి.ప్రజా ఆగ్రహం పోటు అంతకు మించిన స్థాయిలో పెల్లుబుకింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు దిగిరాక తప్పలేదు. ఆ స్ఫూర్తి నేడూ కావాలి.

అంతకంటే ఇంకా ఎక్కువే కావాలి

1966లో ఉద్యమం ప్రారంభమైతే, ప్లాంట్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యేసరికి దశాబ్దాల కాలం పట్టింది. మూడు దశాబ్దాల కాలం కూడా పూర్తిగా నిండకముందే నూరేళ్లు నిండేట్టు చేస్తున్నారు.నాటి ఉద్యమకాలంలో రాజీనామా చేసినవారిలో పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహనీయులు, గౌతు లచ్చన్న వంటి దిగ్గజాలు ఉన్నారు.

అటువంటివారిని నేడు దివిటీ పట్టి వెతికినా ఒక్కరూ కానరారు.ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. మేధావులు, నిపుణులు కూడా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే లాభాలబాటలో నడపడానికి బోలెడు తోవలు ఉన్నాయి.

వాటిన్నంటినీ వడిసిపట్టుకుంటే సమస్య పరిష్కారమైనట్లే అని అందరూ ఘోషిస్తున్నారు. ఈ ఘోష కేంద్రం విని తీరాలి.కలిసికట్టుగా సాగి, వినేట్టు చేయాలి. “రౌతు మెత్తనైతే,గుర్రం మూడు కాళ్ళమీద నడుస్తుంది” అన్నది పాత సామెత.

రచ్చ చేయడం కాదు నిజాయితీగా పోరాడాలి

నేటి నాయకులు అన్నింటా బలహీనులని అనేకసార్లు నిరూపించుకున్నారు. ఇటువంటి వాతావరణంలో, ఒడిస్సా నాయకులు, కేంద్రంలో పెద్దలు, పారిశ్రామిక వేత్తలు,అధికారులు, వారేమి వీరేమి? అందరూ మనమీద పెత్తనం చేస్తారు. ఈ అంశంపై రచ్చ చేయడం శుద్ధ వృధా.

పర్యవసానాలు అలోచించండి ప్రభూ… అంటున్నారు ప్రజలు.పోస్కోతో ఎప్పుడో ఒప్పందం జరిగిందనీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలుసనే వార్తలు దుమారం రేపు తున్నాయి. పోస్కోతో ఎటువంటి ఒప్పందం జరగలేదని కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్రప్రధాన్ కార్మిక సంఘాలతో చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని వామపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు

ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదేమీ పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. దీని వల్ల నైతిక మద్దతు, రాజకీయ సంకేతం ఇవ్వడం మినహా, ఏ మేరకు ప్రతిఫలం ఉంటుందో చెప్పలేం.

 రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి పెద్ద నిర్ణయాలు జరగడానికి అవకాశమే లేదని కొందరు వాదిస్తున్నారు. నిజానిజాలు ప్రభుత్వానికే తెలియాలి. నిజంగా ప్రభుత్వానికి ముందే తెలిసి, దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యకపోతే, అది పెద్ద తప్పే.

బిజెపికి పుట్టగతులు ఉండవ్

దక్షిణాదిలో విస్తరించాలనే కోరికతో ఉన్న బిజెపి ఆంధ్రప్రదేశ్ కు ఇంత అన్యాయం చేస్తే, ప్రజలు క్షమించరు. ఇన్నేళ్ల పార్టీ ప్రయాణంలో, ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఎదుగుదల నామమాత్రం. ఇటువంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో పుట్టగతులు కూడా ఉండవని ఆంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం తొలి అడుగు వేసిందని వైసిపీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం కేంద్రంతో, పోస్కోతో కుమ్మక్కయిందని టిడిపి నేతలు దుమ్మెత్తుతున్నారు.

ఇటువంటి మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, మీడియాలో పబ్లిసిటీ కొట్టేయడం తప్ప. ప్రస్తుతం విశాఖపట్నంకు, అక్కడక్కడా ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైన ఉద్యమం ఢిల్లీని తాకాల్సిందే. కేంద్రం దిగి రావాల్సిందే. స్టీల్ ప్లాంట్ ను మనం కాపాడుకోలేకపోతే మనం చేవ చచ్చినవారిగానే మిగిలిపోతాం. ఉక్కు సంకల్పమే శరణ్యం.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

జనాభా నియంత్రణ పాటిస్తేనే మానవ జాతికి మనుగడ

Satyam NEWS

వనపర్తిలో పొగాకు గుట్కా పట్టివేత; వాహనం సీజ్-కేసు నమోదు

Satyam NEWS

కొత్త రికార్డు దాటిన మెట్రో రైల్ కలెక్షన్లు

Satyam NEWS

Leave a Comment