ఊరందరిదీ ఒక బాధ అయితే, ఉలిపి కట్టెది మరొక బాధ అన్నట్లు, రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్ర తిరోగ వృద్ధిపై, అస్తవ్యస్త వైకాపా పాలనపై, విభజన హామీల సాధనా వైఫల్యాలపై, రాజధాని లేని దుర్మార్గం పై మండిపడుతుంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం రామోజీ మార్గదర్శి లావాదేవీలలో అక్రమాలు జరిగాయంటూ’ఊసరవెల్లి’ ప్రసంగాలతో కాలక్షేపం చేస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.
సోమవారం ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ కు మీడియా ముఖంగా బహిరంగ లేఖ రాశారు. ఇళ్ళు తగలబడి ఒకడు ఏడుస్తుంటే, మరొకడు చుట్టకు నిప్పడిగిన చందంగా ఉండవల్లి వ్యవహారం ఉందన్నారు. రామోజీ మార్గదర్శిపై కేసులే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు గా వ్యవహరిస్తూ, అపరమేధావిగా అధికార పార్టీ మీడియాలో ప్రచారం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లికి బాలకోటయ్య 9 ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
1.ఉండవల్లి గారూ, రామోజీ మార్గదర్శిపై మీ వైరం వ్యక్తిగతమా? రాష్ట్ర ప్రయోజత కార్యక్రమమా? రాష్ట్ర ప్రయోజత కార్యక్రమం అయితే, ఒక్క మార్కదర్శి పొదుపుదారుడు కూడా ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
2.రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిమందికి మార్గదర్శి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన మాట నిజం కాదా? మీరు ఎంపీగా, మేధావిగా ఈ రాష్ట్రంలో ఎంతమందికి జీవనోపాధి కోసం తోడ్పడ్డారు? మీ సుధీర్ఘ రాజకీయ జీవితం లో ఏం సాధించారు?
3 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సంబంధం లేదు అంటున్న మీరు ముఖ్యమంత్రి మీడియా పీఠాధిపతిగా ఎందుకు ప్రచారం పొందుతున్నారు? మాపై లేని అధికార మీడియాకు మీపై ప్రత్యేక ప్రేమ ఎందుకో?
4 పాము విషం చిమ్మిన్నట్లు 15 ఏళ్ళుగా మార్గదర్శిపై విషం చిమ్ముతున్నారు? శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు మీరు సిఎంతో చేతులు కలిపారు. ఏం సాధించారు?
5.ఉమ్మడి ఏపీ విభజన జరిగి 8 ఏళ్ళు గడిచినా విభజనే అన్యాయం అంటూ కోర్టులో పిటిషన్ల వేసి ‘తానే తుమ్మి తానే దీవించుకున్న’ చందంగా మీకు మీరే దీవించుకోవటం వల్ల ప్రయోజనం ఏమిటి? విభజన హామీల గూర్చి కానీ, హోదా గూర్చి కానీ,పోలవరం గూర్చి కానీ, అమరావతి గురించి కానీ ఎందుకు మాట్లాడరు?
6.అమరావతి పురిటి కందుగా ఉన్నప్పుడే వడ్ల గింజ వేసి చంపే ప్రయత్నం చేసిన వాళ్ళలో మీరూ ఒకరు. రాష్ట్ర రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు కానీ, వారి ఉద్యమం కానీ మీకు కనిపించటం లేదా? ఒక్కరోజైనా రాజధాని ఉద్యమ శిబిరాలను సందర్శించారా?
7.ప్రపంచం బాధ శ్రీ శ్రీది అయితే, కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానిది అన్నట్లు మార్గదర్శి పై మీకున్న ఉన్న క్రోధాన్ని, కోపాన్ని రాష్ట్ర ప్రజల కోపంగా చెప్పటంలో ఔచిత్యం ఏమిటి? నాటి వైయస్ నుంచి నేటి వైయస్ వరకు ఎస్ అనటమే మీ పనా?
8. ఏనాడైనా రాష్ట్రంలో దళిత, గిరిజన,మైనార్టీలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాల గూర్చి మాట్లాడారా? డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న మీకు కనిపించరా?
9. మేధావుల ముసుగులో ఏది మాట్లాడినా పండితోత్తములు అనుకుంటారని, చెలామణి అవుతోందనే మీ భ్రమ అధికార పార్టీకి ఊడిగం చేసేందుకు కాదా? దీనిని శల్య సారథ్యం అనరా? అంటూ బాలకోటయ్య ఉండవల్లి అరుణ్ కుమార్ ను 9 ప్రశ్నలతో ప్రశ్నించారు. వీటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.