సుప్రీం చెప్పినా కేసులు ఉపసంహరించుకుంటున్న జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోదా? ఏమో ఈ పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తున్నది.
ఆయా రాష్ట్రాల హైకోర్టు అనుమతి లేకుండా ఏ ఎంపీ, ఎమ్మెల్యేపైనా ప్రాసిక్యూషన్ను ఉపసంహరిచరాదు’ అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించి రెండు రోజులు కూడా గడవలేదు. ఇంతలోనే నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
గోవర్ధన్ రెడ్డిపై నమోదైన నకిలీ పత్రాలు, పరువునష్టం కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మాజీమంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి మలేసియా, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో రూ.1,000కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయంటూ 2016లో కాకాణి సంచలన ఆరోపణలు చేశారు.
దీనికి సంబంధించి పలు పత్రాలు విడుదల చేశారు. అయితే తనపై కాకాణి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నకిలీ పత్రాలతో కుట్రలు పన్నుతున్నారని రూరల్ పోలీసుస్టేషన్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు… కాకాణి విడుదల చేసిన పత్రాలు నకిలీవని తేల్చారు.
వాటిని తయారుచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టుచేశారు. ఆ సమయంలో కాకాణి కొన్నిరోజుల పాటు అదృశ్యమయ్యారు. ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోగా జిల్లాకోర్టులో తిరస్కరించారు.
అనంతరం కాకాణి హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ను తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు జిల్లా 4వ అదనపు జడ్జి కోర్టులో ఉంది. ఇప్పుడు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రభుత్వ నిర్ణయంపై సోమిరెడ్డి హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.