ఒక వ్యక్తి తన మాట కాదని పదవిలో కొనసాగుతున్నారన్న ఒకే ఒక కారణంతో రాజకీయంగా అందివచ్చిన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్పోతున్నారు.
151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికలలో లాభం చేకూరుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పైపే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు మొగ్గు చూపుతారు.
అందులోనూ అత్యధిక మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నల్లేరుపై నడకలా సాగుతాయి.
ఇదే విషయం జెడ్ పి టి సి, ఎంపి టిసి ఎన్నికలలో రుజువైంది కూడా. ఎక్కువ స్థానాలలో ఏకగ్రీవాలు కూడా అయ్యాయి.
అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఇదే డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు.
ఆయన ఎన్నికలు నిర్వహించినప్పుడే అత్యధిక స్థానాలు ఏకగ్రీవం చేసుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనపై ఎందుకు కక్ష పెంచుకున్నారో అర్ధం కావడం లేదు.
కులం పేరుతో దూషించి మరీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంకుపట్టు పట్టి కూర్చోవడం ఎందుకో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిర్వహించి అన్ని స్థానాలలో గెలిచే అవకాశాన్ని జగన్ మోహన్ రెడ్డి కోల్పోవడం ఆయనకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికలలో విజయఢంకా మోగిస్తే ఆ ప్రభావం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై పడుతుంది.
ఇన్ని లాభాలను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోల్పోతున్నారు.
రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వగానే తొందరపడి చాలా మంది వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడారు.
హైకోర్టు ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసి ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కోర్టులపై మళ్లీ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా టీమ్ ఎంతో సమర్ధంగా పని చేస్తూ అందరిపైనా బురద చల్లుతున్నది కానీ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నదో ఎవరూ గమనించడం లేదు.
క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత ఎంత బలంగా రూపుదిద్దుకుంటున్నదో అర్ధం చేసుకోవడం లేదు.
ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త సమస్యలు సృష్టిస్తున్నట్లుగా ఉన్నదే తప్ప పరిపాలన సజావుగా సాగిస్తున్నట్లు కనిపించడం లేదు.