వైనాట్ 175 అని పదేపదే రంకెలేస్తున్న అధికార వైసిపి పార్టీ ఉత్తరాంధ్ర,తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిని పూర్తిగా సమీక్షించుకోలేక చతికిల పడిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.
శనివారం ఆయన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖలోని అందమైన రుషికొండను అందవిహీనంగా చేయటాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేక పోయారన్నారు. దసపల్లా భూములతో పాటు వందల ఎకరాలను ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు దిగమింగటాన్ని సహించలేకపోయారన్నారు. దీంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అన్నారు.
తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం ఉందన్నారు. రాయలసీమ ప్రజలకు సుపరిచితమైన ‘పెద్దాయన’ గొడ్డలి వేటు కథలోని నిజానిజాలు రాయలసీమ వాసులకు అర్థమయ్యాయని, దారుణమైన హత్యను నాలుగేళ్లైనా న్యాయం చేయకుండా ఆడుతున్న నాటకాలకు వ్యతిరేకంగానే పట్టభద్రులు వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
వీటితోపాటు రాష్ట్రంలో గాడి తప్పిన పరిపాలన, అధికార పార్టీ అవినీతి, అరాచకం, దౌర్జన్యం వంటి అంశాలు కూడా ప్రభావితం చేశాయి అన్నారు. మూడు ‘ముక్కల’ రాజధానులతో చేసిన మోసాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ పట్టభధ్రులు నమ్మలేదన్నారు. పట్టభద్రులు గా గెలుపొందిన టిడిపి అభ్యర్థులకు అభినందనలు చెబుతూనే, ప్రతిపక్ష పార్టీపై ప్రేమ కంటే, ప్రభుత్వ దుర్మార్గాలపై పట్టభద్రులు తిరగ బడ్డారు అన్నారు. ప్రభుత్వంపై తెగించి పోరాడుతున్న గళాలకు మద్దతుగా నిలిచారు అన్నారు. ఇది దేవుని స్క్రిప్ట్ కాదని, ప్రజాస్వామ్య శక్తుల విజయం మాత్రమే అని, రాబోవు ఎన్నికలకు రిఫరెండం కూడా అని బాలకోటయ్య అభివర్ణించారు.
20న చలో అసెంబ్లీకి మద్దతు
ఈనెల 20వ తేదీన జీవో నెంబర్ 1రద్దు కోరుతూ జరుగుతున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలిపారు. కేవలం ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక గొంతుకలను అణచి వేసేందుకే 1861 బ్రిటీష్ కాలపు చీకటి జివో తెచ్చారని చెప్పారు. 72 ఏళ్ళ స్వాతంత్ర్యంలో ఇలాంటి జివో రాలేదు అని హైకోర్టు చెబితే, పంతం పట్టి ప్రభుత్వం జివోను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టించింది అని పేర్కొన్నారు. నిర్భంధాలతో ఉద్యమాలను అణచాలనుకోవటం ప్రభుత్వ అవివేకం అన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బిసి, మైనార్టీ కులాల నాయకులు, కార్యకర్తలు చలో అసెంబ్లీ లో పాల్గొని జయప్రదం చేయాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.