ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బిజేపి ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి పరిశీలకులను నియమించింది. ఉత్తర్ ప్రదేశ్ పరిశీలకునిగా హోంమంత్రి అమిత్ షాను ఎంపిక చేయగా, ఉత్తరాఖండ్కు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ను అధిష్ఠానం పంపుతోంది. మణిపుర్, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కు అప్పగించింది. గోవాలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒక్క అడుగు దూరంలో ఆగిన బిజేపి స్వతంత్రుల సాయంతో అధికార పీఠం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అమిత్ షాతో పాటు సహ పరిశీలకునిగా భాజపా ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్, ఉత్తరాఖండ్ శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం రాజ్నాథ్ సింగ్కు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి సహాయం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపుర్ సహ పరిశీలకునిగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, గోవా సహ పరిశీలకునిగా ఎల్ మురుగన్లు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
ఇదిలా వుండగా గోవాలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీఎల్ సంతోశ్లు గోవా చేరుకుని గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలో బరిలోకి దిగింది బిజేపి. పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం సావంత్ క్యాబినెట్లో ఆరోగ్య మంత్రిగా పని చేసిన విశ్వజిత్ రాణె ఈ సారి సీఎం పీఠం అధిరోహించనున్నట్లు తెలుస్తోంది.