ఏపీలో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నైతికంగా గెలిచిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ప్రకటించారు.
ప్రజలు వైకాపా దౌర్జన్యాలకు ఎదురొడ్డి ప్రజాస్వామ్యాన్ని బతికించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 13000 గ్రామ పంచాయితీలలో టిడిపి 5200 పైగా గెలిచి 40 శాతం పంచాయతీలను కైవసం చేసుకున్నదాని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ 90 శాతం పంచాయతీలలో ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రయత్నిస్తే 16 శాతమే సాధ్యమయ్యాయని, అందులోను 30 శాతం పైగా తెలుగుదేశానికి వచ్చాయని ఆయన వివరించారు. ఎన్ని అరాచకాలు, అవకతవకలు చేసినా, అడ్డదారులు తొక్కినా పల్లె ప్రజలు జగన్ ను తిరస్కరించారని సుధాకర్ రెడ్డి తెలిపారు.
దీంతో ఏకగ్రీవాలలో 800 పైగా పోటీ జరిగిన పంచాయతీలలో 4421చోట్ల టిడిపి విజయం సాధించిందని ఆయన వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే 70 శాతం పంచాయతీలు తెలుగుదేశం పార్టీ పరమయ్యేవని ఆయన అన్నారు.
రానున్న మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో 80 శాతం తెదేపా జెండా ఎగరడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాబట్టి రాష్ట్రంలో పల్లె పోరు ముగిసింది, ప్రజాస్వామ్యం మురిసింది, చంద్రన్న పనులపై నమ్మకం కుదిరింది, ప్రజలు పసుపు జెండాకు బాసటగా నిలిచారు, తెలుగు దేశం గెలిచింది అని ఎన్ బి సుధాకర్ రెడ్డి తెలిపారు.