ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పినట్లే పని చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. నేడు కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నదని రామకృష్ణ అన్నారు.
దేశవ్యాప్తంగా దాదాపు పేద వర్గాలు, మధ్య తరగతి వర్గాలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొని ఉన్నదని ఆయన అన్నారు. పెట్టుబడి దారుల ఆస్తులు మాత్రం దేశంలో పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. అమిత్ షా, ప్రధాని మోడీ ఆప్తుడు అయిన ఆదాని ఆస్తులు 400 శాతం రెట్టింపు అయ్యాయి.. ప్రభుత్వ సంస్థలన్నీ కేంద్రం ప్రయివేటికరణ చేస్తున్నది అని ఆయన అన్నారు.
ప్రభుత్వ సంస్థలన్నీ కాపాడటానికి సీపీఐ పోరాడుతూనే ఉంటుంది.. విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి సీపీఐ పోరాటాలకు సిద్ధం అవుతున్నది..ఈ నెల 14 వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు సీపీఐ సిద్ధం అయ్యింది..అని ఆయన తెలిపారు. మోడీ ని చూస్తే వైసీపీ ఎంపీలు గజగజ వణుకుతున్నారని ఆయన అన్నారు.
కేంద్ర లోని బిజెపి మెడలు వంచేందుకు పాదయాత్ర చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ ను రద్దు చేసి మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. రైతుల ను మభ్య పెడుతున్న సీఎం జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శాంతిభద్రతల పర్యవేక్షణ విషయంలో విఫలమయ్యారని రామకృష్ణ ఆరోపించారు. తాడేపల్లి నుంచి మొత్తం పరిపాలన సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారని అందువల్ల రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.