తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి హైకోర్టు తీర్పుతో ఏపి క్యాడర్ లో తిరిగి జాయిన్ అయిన సోమేశ్ కుమార్ కు ప్రాధాన్యత ఎక్కువ ఉన్న శాఖను కేటాయించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారని తెలిసింది. సోమేశ్ కుమార్ కు గౌరవ ప్రదమైన స్థానం ఇవ్వాలని ఆయనను ఏపికి పంపే క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపి సిఎం ను కోరినట్లు చెబుతున్నారు.
దాంతో ఏపి ఐఏఎస్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా సోమేశ్ కుమార్ కు అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టింగ్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఏపికి తీరని అన్యాయం చేసిన సోమేశ్ కుమార్ పై ఏపి క్యాడర్ ఐఏఎస్ లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఐఏఎస్ -ఐపీఎస్ అధికారుల విభజన జరిగింది.
అందులో భాగంగా ఏపీకి కేటాయించిన సోమేశ్ కుమార్ క్యాట్ లో పిటీషన్ దాఖలు చేసి తెలంగాణలో కొనసాగారు. అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో హైకోర్టు తీర్పు వచ్చింది. సోమేశ్ ను తెలంగాణ ఎలాట్ మెంట్ రద్దు చేస్తూ వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో, తెలంగాణలో రిలీవ్ అయిన సోమేశ్ ఏపీలో రిపోర్టు చేసారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు సోమేశ్ సర్వీసులో కొనసాగనున్నారు.
ఏపీలో రిపోర్టు చేసిన తరువాత పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టింగ్ లకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. సోమేశ్ కు కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం పైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పోస్టింగ్ ల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పంచాయితీ రాజ్ రూరల్ డెవలప్ మెంట్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గోపాల క్రిష్ణ ద్వివేదికి వ్యవసాయ శాఖ అప్పగించాలని నిర్ణయించారు. మరో అధికారి రాజశేఖర్ కు పంచాయితీ రాజ్ శాఖ అప్పగించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. వీరితో పాటుగా మరి కొందరు సీనియర్ అధికారుల పోస్టింగ్ ల పైన ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.